కాంగ్రెస్ను కింగ్ చేసిన కన్నడ రీజియన్స్ ఇవే

by Dishafeatures2 |
కాంగ్రెస్ను కింగ్ చేసిన కన్నడ రీజియన్స్ ఇవే
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ప్రజలు బీజేపీని కాదనుకొని కాంగ్రెస్ కు పట్టం కట్టారు. హస్తం పార్టీ సంక్షేమ ఎజెండాకు జై కొట్టారు. దీంతో కాంగ్రెస్ ఖాతాలోకి పెద్ద ఎత్తున సీట్లు వచ్చి చేరాయి. సింగిల్ గా సర్కారు స్థాపించేంతగా మెజార్టీ కైవసం అయింది. అయితే ఈ విజయాన్ని ఒక్క ముక్కలో నిర్వచించలేం. దాన్ని కొన్ని భాగాలుగా విభజించుకుని సూక్ష్మ విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ముంబై కర్ణాటక (కిత్తూర్ కర్ణాటక), హైద్రాబాద్ కర్ణాటక (కల్యాణ కర్ణాటక), దక్షిణ కర్ణాటక & మల్నాడ్, కోస్టల్ కర్ణాటక, బెంగళూరు అనే 5 ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం సమయానికి విడుదల అవుతున్న కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో.. ఆయా పార్టీలు లీడ్ లో ఉన్న స్థానాల ఆధారంగా మొత్తం 5 ప్రాంతాలలో బలాబలాలపై విశ్లేషణ ఇది.

దీని ప్రకారం.. ముంబై కర్ణాటక, దక్షిణ కర్ణాటక & మల్నాడ్, హైద్రాబాద్ కర్ణాటక ప్రాంతాలపై హస్తం పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. ముంబై కర్ణాటక ప్రాంతంలోని మొత్తం 62 అసెంబ్లీ సీట్లకుగానూ ఇంచుమించు 40 కాంగ్రెస్ చేతికి చిక్కే ఛాన్స్ ఉంది. 2018 ఎన్నికలతో పోలిస్తే.. ఇక్కడ కాంగ్రెస్ కు దాదాపు 20 సీట్లు పెరుగుతాయి. గత పోల్స్ లో ఇక్కడ 41 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి 20కి మించి సాధించలేక చతికిలపడింది. జేడీఎస్ కు ఇక్కడ 2 సీట్లే లభించనున్నాయి. ఈ ప్రాంతంలోని 45 శాతం ఓట్లను కాంగ్రెస్, 40 శాతం ఓట్లను బీజేపీ, 5 శాతం ఓట్లను జేడీఎస్ పొందాయి. కన్నడ గడ్డపై కాంగ్రెస్ విజయ భేరి మోగించడంలో ముంబై కర్ణాటక కీలక పాత్ర పోషించిందని నిస్సందేహంగా చెప్పొచ్చు.

దక్షిణ కర్ణాటక & మల్నాడ్ ప్రాంతంలో..

దక్షిణ కర్ణాటక & మల్నాడ్ ప్రాంతంలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడకు చెందిన జేడీఎస్ కు ఆయువుపట్టు ఇక్కడే ఉంది. ఇప్పుడు జేడీఎస్ సాధించిన దాదాపు రెండు డజన్ల సీట్లలో 99 శాతం ఇక్కడ గెలిచినవే. ఇక్కడ కాంగ్రెస్ 39, బీజేపీ 12, జేడీఎస్ 19 సీట్లను ఇంచుమించుగా గెలిచే ఛాన్స్ ఉంది. గత అసెంబ్లీ పోల్స్ తో పోల్చుకుంటే కాంగ్రెస్ సీట్లు ఇక్కడ డబుల్ కానుండటం విశేషం. ఈ రీజియన్ లో 40 శాతం ఓట్లను కాంగ్రెస్, చెరో 25 శాతం ఓట్లను బీజేపీ, జేడీఎస్ పొందాయి.

హైద్రాబాద్ కర్ణాటక ప్రాంతంలో..

హైద్రాబాద్ కర్ణాటక ప్రాంతంలో దాదాపు 38 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. గత ఎన్నికల్లో ఈ రీజియన్ లో కేవలం 5 సీట్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ .. ఈసారి తడాఖా చూపించి 26 సీట్లను మూట కట్టుకోనుంది. ఇక ఇదే సమయంలో బీజేపీ సీట్ల 15 నుంచి 9 కి తగ్గిపోనుంది. జేడీఎస్ 3 సీట్లు గెలవనుంది. ఈ ఏరియాలో 46 శాతం ఓట్లను కాంగ్రెస్, 36 శాతం ఓట్లను బీజేపీ, 10 శాతం ఓట్లను జేడీఎస్ పొందాయి.

బెంగళూరు ప్రాంతంలో..

బెంగళూరు ప్రాంతంలో దాదాపు 28 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఇక్కడ బీజేపీ అత్యధికంగా 16 సీట్లను గెల్చుకోనుంది. 11 స్థానాల్లో కాంగ్రెస్ , 1 స్థానంలో జేడీఎస్ విజయం సాధించనున్నాయి.

కోస్టల్ కర్ణాటక ప్రాంతంలో..

కోస్టల్ కర్ణాటక ప్రాంతం కూడా బీజేపీకి కలిసొచ్చింది. ఇక్కడ కమలదళం 14 సీట్లు గెలవనుండగా .. కాంగ్రెస్ కు 4 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read More... కర్నాటక సీఎం ఎవరు.. ఎల్పీ భేటీలో రాత్రికల్లా ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు?

Next Story

Most Viewed